కుక్కల బారి నుంచి జింకను రక్షించి.. ఆపై దానిని వండి తినేసిన గ్రామస్థులు

  • ఛత్తీస్‌గఢ్‌లో మచ్చల జింకను చంపిన గ్రామస్థులు
  • కుక్కల దాడి నుంచి కాపాడి, ఆ తర్వాత వండుకు తిన్న వైనం
  • ఐదు ఇళ్లపై అటవీశాఖ అధికారుల దాడులు
  • జింక మాంసం స్వాధీనం, ఐదుగురి అరెస్ట్
  • వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు
ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కొందరు గ్రామస్థులు కుక్కల బారి నుంచి ఓ మచ్చల జింకను కాపాడారు. అయితే, ఆ తర్వాత దానిని చంపి, వండుకుని తిన్నారు. రాయ్‌గఢ్ జిల్లాలోని దెలారి గ్రామంలో జరిగిందీ ఘటన. 

సమీప అడవి నుంచి ఆహారం, నీటి కోసం ఓ మచ్చల జింక దారి తప్పి గ్రామంలోకి వచ్చింది. అది ఊళ్లోకి ప్రవేశించగానే ఓ కుక్కల గుంపు దానిపై దాడి చేసి గాయపరిచింది. ఇది గమనించిన కొందరు గ్రామస్థులు మొదట కుక్కలను తరిమికొట్టి జింకను రక్షించారు. కానీ, ఆ తర్వాత వారి ఆలోచన మారింది. గాయపడిన జింకను చంపి, దాని మాంసాన్ని గ్రామస్థులంతా పంచుకున్నారు.

గ్రామంలోని కొన్ని ఇళ్లలో జింక మాంసం వండుకుని తింటున్నారన్న రహస్య సమాచారం అటవీ శాఖ అధికారులకు అందింది. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు దాడులు నిర్వహించారు. ఐదు ఇళ్ల నుంచి మాంసం ముక్కలను స్వాధీనం చేసుకుని, ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపారు.

ఆత్మారామ్ రాథియా, మయారాం రాథియా, హరిచరణ్ సావో సహా ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా, వారు నేరం అంగీకరించినట్టు అధికారులు తెలిపారు. నిందితులపై వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972 కింద కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపరచగా వారికి జ్యుడీషియల్ కస్టడీ విధించారు. అటవీ వనరులపై ఒత్తిడి పెరగడంతో వన్యప్రాణులు జనావాసాల్లోకి రావడం, ఇలాంటి ఘటనలకు దారితీయడం ఆందోళన కలిగిస్తోందని అధికారులు పేర్కొన్నారు.

Chhattisgarh
Deer
Chhattisgarh deer
Delari village
Raigarh district
Wildlife Protection Act 1972
Forest department
Poaching
Hunting
Indian Spotted Deer

More Telugu News